ఏపీలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్లో మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ఆయన స్పందించారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయని పేర్కొన్నారు.
మద్యం విక్రయాల్లో దుకాణదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అలాగే సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా కొనసాగించాలని మార్గనిర్దేశం చేశారు. అధిక ధరలకు మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు.